toli telugu padakarta,sankeertanaachaaryudu krishnamayya


  తొలి తెలుగు పదకర్త క్రిష్ణమయ్య -ఒక చారిత్రిక సత్యం        

   మరుగున పడిన మాణిక్యం ,పరమ భక్తుడైన ఒక మహాపురుషుడు గురించిన చారిత్రిక సత్యం క్రుష్ణమయ్య ఫౌండేషన్ (విశాఖపట్నం)  అద్యక్షులు ,సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త డా.పూసపాటి ఆనంద గజపతి రాజు(ఆంధ్రప్రదేశ్ మాజీ ఆరోగ్య,విద్యాశాఖల అమాత్యులు) మీ ముందు ఆవిష్కరిస్తున్నారు.
                              ఓం శ్రీ రామ 


         తొలి తెలుగు పదకర్త క్రిష్ణమయ్య -ఒక చారిత్రిక సత్యం
                                                                          ---------------------------
               ` వేదంబు తెనుగు గావించి సంసార ఖేదంబును  పోగొట్టిన తెలుగు వేద ద్రష్ట' అని అన్నమయ్య మనుమడు చిన్నన్న క్రిష్ణమయ్యను పేర్కొంటూ తమ సంకీర్తనల ద్వారా క్రిష్ణమయ్య ``ఆంధ్ర వేదాంత కర్త'గా `పంచమాగమ సార్వభౌములు 'గా కీర్తించారు.
                  ప్రఖ్యాత కవి,రచయిత ఆరుద్ర తమ `సమగ్రాంధ్ర చరిత్ర'లో క్రిష్ణమయ్య ను` సంకీర్తనానికి మార్గదర్సకుడి'గా పేర్కొన్నారు.
                                 ఎవరీ క్రిష్ణమయ్య?
క్రిష్ణమయ్య  మరుగున పడిన ఒక మాణిక్యం!.ఒక మహాపురుషుడు !ఒక మహితాత్ముడు!
  సింహాచలం  లొ వెలసిన  శ్రీ  వరాహలక్ష్మీ  నరసింహస్వామి  పరమ భక్తుడు  ,అన్నమయ్యలాంటి సంకీర్తనాచార్యులకు,పోతన వంటి  భాగవతొత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గెయకారుడు.వారికంటే  ప్రాచీనుడు.ఇదికల్పిత గాధ కాదు,చారిత్రిక సత్యం. తెలుగువారు గర్వించదగ్గ  సాంస్క్రుతిక వారసత్వం.
దక్షిణాది సంగీత చరిత్రలో ఈ ఆవిష్కరణ ఒక నూతన అధ్యాయానికి  తెర తీస్తోంది!
భక్తీ సంగీత చరిత్రలో ఈ ఆవిష్కరణ ఆనందాశ్చర్యాలతో కూడిన ఒక చర్చకు దారితీస్తోంది!
ఇది కల్పిత కధ కాదు!చారిత్రిక సాక్ష్యాధారాలున్నఒక సంకీర్తనాచార్యుని  జీవితగాధ!

.కృష్ణమయ్య  ఆళ్వారు శ్రేణికి చెందిన తెలుగులో మొదటి  పద కవితాచార్యుడు.భగవద్ శ్రీ రామానుజాచార్యుల్ని అధ్యయనం చేసిన అసలైన వైష్ణవపండితుడు.
వారి   ద్వారానే భగవద్ రామానుజాచార్యులు భగవదనుగ్రహం పొందగాలిగేరన్నది చారిత్రిక సత్యం!
వారి గానానికి వశుడై  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి భూమిలో కూరుకు పోయిన పాదాలు గలవాడు ,ఎగిరి నృత్యం చేసాడట!ఇది మరో చారిత్రిక సత్యం!
                 క్రిష్ణమయ్య పూర్తి పేరు శ్రీకాంత కృష్ణమాచార్యులు  క్రీ.శ.  1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర 'సిద్దేశ్వర చరిత్ర'తిరగవేస్తే ఈయన జీవితం కనిపిస్తుంది.క్రిష్ణమయ్య  తన `జన్మ సంకీర్తన' లో తాను `తారణ' నామ  సంవత్సరం,భాద్రపద కృష్ణ చతుర్దశి ,మంగళ వారం నాడు  జ్యేష్టా నక్షత్రములో   సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ,తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ ,ఆయన  ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు ..  క్రిష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే  నరసింహస్వామి బాలుని రూపం లో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. క్రిష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి`పదకొండవ అవతారుని'గా కొనియాడబడినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒక పదంలో క్రిష్ణమయ్యే `తాను ఒక పదకొండవ అవతారాన్నని విజ్ఞప్తి చేసాడు ఎంత గుండె ధైర్యం కావాలి?కోపోద్రిక్తమైన అవతారాన్ని ఆజ్ఞాపించిన భక్తుడు క్రిష్ణమయ్య. ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వ్రాయసకారుడిగా ఉన్నప్పుడు క్రిష్ణమయ్య సింహాద్రి నరసింహుని స్తుతిస్తూ  గానం చేస్తే కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారాల  ద్వారా తెలుస్తోంది.సన్నిధి ఆళ్వారులలో ఇంతటి ప్రజ్ఞావంతుడు మనకి కనిపించడన్నది అక్షర సత్యం.
              .ఈయన .వేదపండితుడు.పదాలలో ఛందస్సు శృంఖలాలను విసర్జించి ,భావాలకి విశృంఖల సోయగాలను అందించిన భాషా విప్లవ వాది. క్రిష్ణమయ్య సింహగిరినరహరి  ఆదేశంతో,అనుగ్రహంతో  స్వామిని  స్తుతిస్తూ `సింహగిరి వచనాలు'అనే పేరిట నాలుగు లక్షల కీర్తనలతో వాక్పూజ చేసి వాటిని రాగి రేకులపై నిక్షిప్తం చేసి సింహాచలేశునికి   సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది.వాటిలో చాలామట్టుకు పారిస్ లోని కింగ్స్ లైబ్రరీ కి తరలించినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.తంజావూరు సరస్వతీమహల్ లో రెండువందల దాకా కీర్తనలు లభ్యం అయ్యాయి,మిగతావి ఏ అంధకార బిలం లోనో అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
                     క్రిష్ణమయ్య రచన ,సంగీతం,నాట్యం ,భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి ,.ప్రతిభావంతుడు అన్నింటికీ మించి అభ్యుదయవాద.వచన రచన చేయడం,మాల దాసర్లతో సహపంక్తి భోజనం చేయడం,దేవదాసీ కాంతలతో సహవాసం చేస్తూ ,భక్తీ గీతాలు పాడుతూ నాట్యం చేయడం ,నాటి మూఢ ఆచారాలను అతిక్రమించడం ,చాందస ఆచార్యులను ఎదిరించడం కులమత బేధాలను పాటించకపోవడం వంటివి ఎన్నో అభ్యుదయ భావాలు కృష్ణమయ్య రూపు రేఖలు.వారి కృతుల సారాంశం కూడా ఇదే!. పురాణ ,ఇతిహాసిక గాధలు సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలుగా స్థిరపడిపోయాయి.సంస్కృతంలో వ్రాసిందే కావ్యంగా ప్రసిద్ధికెక్కింది.ఆ రకంగానే సంస్కృతంలో రచించిన కావ్యాలూ ,దైవం కూడా సామాన్య జనానికి దూరం అయిపోతూ వచ్చాయేకాని ,సన్నిహితం కాలేకపోయాయి.ఆ కావ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండాలనీ ,భక్తి భావం సామాన్య జనానికి అందించాలనే సత్సంకల్పంతో ,సంసార ఖేదాలని రూపుమాపటానికి కంకణం కట్టుకుని క్రిష్ణమయ్య వేదాలనీ ,ఉపనిషత్ సారాన్ని తెలుగులో తేలికైన మాటలతో వచన రచన చేసి సంగీత,నాట్య శాస్త్రాలని మిళితం చేసి సామాన్య జనానికి అర్ధం అయ్యే రీతిలో గానం చేసి ప్రదర్శించేవారు. కృష్ణమయ్య ది జానపద విలక్షణమైన పధ్ధతి.పాండిత్య ప్రకర్ష తక్కువగాను ,జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది.ఈయన పామర భాషలో భక్తిని అందించి ,వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది.అయితే భాషా ,భావాల్లోని వైప్లవ్యమే ఇతని పాలిటి శాపమైంది.ఇంతటి బహుముఖప్రజ్ఞాశాలిని వైష్ణవ ఛాందసులు ఒక అనాచార్యుడిగాను ,భ్రష్టాచారిగాను ముద్ర వేసి వైష్ణవం నుండి వెలివేయడం అన్నది ఒక్క వీరి పాలిట శాపమే కాదు యావత్ వైష్ణవ లోకానికీ శాపమైంది.
                      అన్నమయ్య పన్నెండు సంవత్సరాలు సింహాచలం లో నివసించి గురు  శుశ్రూష చేసిన అనంతరం తిరుపతి వెళ్లి సంకీర్తనల రచన ప్రారంభించినట్టు  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన అన్నమయ్య చరిత్రద్వారా తెలుస్తోంది.అన్నమయ్య సింహాచలం లో ఉన్నప్పుడే  క్రిష్ణమయ్య సంకీర్తనలవల్ల ప్రభావితం అయి ఆయన అందించిన స్ఫూర్తితో  సంకీర్తల రచన చేసినట్టు మనకు విదితమవుతోంది, ఇందుకు రెండు క్రిష్ణమయ్య కీర్తనలని ఉదాహరణలుగా ఈ దిగువ ఇవ్వబడ్డాయి.
దేవా!
   విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే  హరికీర్తనము జేయునతడే కులజుండు .
   శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు.........
    (అన్నమయ్య కీర్తన-ఏ కులజుండైన నేమి?)
దేవా!
గంగోద్బవమైన మీ దివ్య శ్రీపాద యుగళమ్ము గంటి..........
ఇంద్రాది దిక్పతులు మిమ్ము సేవింపగా  గంటి 
కనకపీతాంబర ప్రభావమ్ము గంటి ............
(అన్నమయ్య కీర్తన -ఇప్పుడిటు కలగంటి )
                క్రిష్ణమయ్య అందించిన స్ఫూర్తి తో అన్నమయ్య వేల వేల పదాలు రాస్తే క్రిష్ణమయ్య లక్షలాది పదాలు కూర్పు చేసాడు .రాగిరేకులలో నిక్షిప్తం చేసాడు..అయితే అన్నమయ్య పదాలు వెలుగు చూసాయి .ఇతగాడివి ఇంకా ఏ అంధకార బిలంలోనో అజ్ఞాతవాసం చేస్తున్నాయి.క్రిష్ణమయ్య ఏ కాలంవాడో,అతని సమకాలికులెవరో,అతని రచనలు ఏమయ్యాయో అన్న విషయాలపై  చాలా పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత వుంది.
    
          
   వీరి ప్రజ్ఞాపాటవాలని  వెలుగులోకి తేవాలని చేస్తున్న  ప్రయత్నాల ఫలితంగా సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త డా.పూసపాటిఆనంద గజపతి రాజుగారి అద్యక్షతన విశాఖపట్నం లో  `కృష్ణమయ్య  ఫౌండేషన్' ఆవిర్భవించింది.ఈ ఫౌండేషన్ కృష్ణమయ్య జీవితం ,ఆయన వాంగ్మయం ప్రాచుర్యం లోకి తెచ్చే ప్రయత్నాలలో  భాగంగా ఆయన జీవిత చరిత్ర,వాంగ్మయం  ప్రచురించడం,ఆయన సంకీర్తనలని నేర్పించి,పాడించి రికార్డు చేయడం,భారత  దేశంలోనే కాకుండా అమెరికా,బ్రిటన్ ,కెనడా వంటి దేశాలలో క్రిష్ణమయ్య సంకీర్తనల కచేరీలు,నృత్య  ప్రదర్సనలుఏర్పాటు చేయడం  సదస్సులు నిర్వహించడం ,కృష్ణమయ్య   జీవితం వాంగ్మయం  కి సంబంధించిన న పరిశోధకులని  ప్రోత్సహించడం  ,షార్ట్  ఫిలిం,t.v సీరియల్ నిర్మించడం మొదలైన  కార్యక్రమాలని చేపడుతోంది .తెలుగువారి సాంస్కృతిక వారసత్వం నిలబెట్టడానికి యావత్ప్రపంచంలోని తెలుగువారి సహాయ సహకారాలని అర్ధిస్తూ 
                                                                                                                                                         భవదీయుడు
                                                                                                                                                వినుకొండ మురళీ మోహన్
                                                                                                                                                           సంచాలకుడు
                                                                                                                                                 క్రిష్ణమయ్య ప్రాజెక్ట్ ,విశాఖపట్నం 
మరిన్ని వివరాలకోసం,కృష్ణమయ్య కీర్తనలు వినడంకోసం మా బ్లాగ్ చూడవచ్చు                          e mail i.d;krishnamayyafoundation@gmail.com




                                       

2 comments:

  1. బావుంది. మీరు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తూ

    డా. అద్దంకి శ్రీనివాస్

    ReplyDelete